నూతన సాంకేతిక ఆవిష్కరణలో ప్రపంచ వ్యాప్త పోటీకి ధీటుగా 11 అధ్యాయాల సమర్పణ
ఉన్నత టెక్నాలజీ విద్యార్థులకు అందించడమే లక్ష్యం
-ఆర్జీఎమ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి.జయచంద్ర ప్రసాద్, డైరెక్టర్ డాక్టర్.డివివి అశోక్ కుమార్
నంద్యాల (బిఎన్ న్యూస్), ఫిబ్రవరి 17: ప్రపంచంలోని ఇంజనీరింగ్ విద్యార్థులందరిని ఒకే వేదికపై తెచ్చి నూతన సాంకేతిక విప్లవంలో వారిని భాగస్వాములను చేస్తున్న ఐఈఈఈ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్స్) సంస్థ ఆధ్వర్యంలో ఆర్జీఎమ్ ఇంజనీరింగ్ కళాశాల నందు 403 మంది విద్యార్థులతో ఏర్పాటు చేసిన స్టూడెంట్ బ్రాంచ్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ టెక్నాలజీలోని నూతన ఆవిష్కరణలకు సంబంధించిన 11 అధ్యాయాలను సమర్పించి విద్యార్థులు తమ సత్తా చాటారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్జీఎమ్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి.జయచంద్ర ప్రసాద్, డైరెక్టర్ డా.డివివి అశోక్ కుమార్, కళాశాల ఉమెన్ ఎంపవరింగ్ వింగ్ ఇన్ఛార్జి డా.సోఫియా ప్రియదర్శిని, ఐఈఈఈ హైదరాబాద్ సెక్షన్ అడ్వైజర్ డా. విజయ లత, అనంతపురం సబ్ సెక్షన్ ఛైర్మన్ డా వై.వి శివారెడ్డి, సెక్రటరీ డా.ఎంఏ జబ్బార్, బ్రాంచ్ కౌన్సిలర్ డా.వి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డా.టి.జయచంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఐఈఈఈలో గ్లోబల్ సభ్యత్వం ద్వారా, ఏరోస్పేస్ సిస్టమ్స్, కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్స్ నుండి బయోమెడికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రిక్ పవర్, కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ , రోబోటిక్స్, ఇతర డొమైన్లలోని రంగాలలో తమ కళాశాల విద్యార్థులు అధ్యాయాలు సమర్పించారని తెలిపారు. ఆర్జీఎమ్ విద్యాసంస్థల డైరెక్టర్ డా.డివివి అశోక్ కుమార్ మాట్లాడుతూ ఐఈఈఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాశాలలు, విశ్వవిద్యాలయాలలోని విద్యార్థులను సభ్యులుగా చేర్చుకొని సాంకేతిక పరిజ్ఞానాన్ని పరస్పరం పంచుకొనేలా చేస్తుందని తద్వారా నూతన ఆవిష్కరణలలో వారిని భాగస్వాములను చేస్తుందన్నారు. ఐఈఈఈ హైదరాబాద్ విభాగం కింద ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అత్యధికంగా 403 మంది సభ్యులతో తమ కళాశాల నందు స్టూడెంట్ బ్రాంచ్ ఏర్పాటు చేశామని అన్నారు. హైదరాబాద్ సెక్షన్ అడ్వైజర్ డా.విజయ లత మాట్లాడుతూ ఐఈఈఈలో భాగస్వాములైన విద్యార్థులకు ప్రపంచ స్థాయి కంపేనీలు ఉద్యోగాల్లో ప్రాధాన్యత ఇస్తాయని అన్నారు. నూతన ఆవిష్కరణలో వైపు విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఐఈఈఈ, నగదు సాయం అందిస్తున్నారని తెలిపారు. ప్రతిభ చూపిన సభ్యులను, గ్లోబల్ స్థాయిలో గుర్తింపు లభిస్తుందని అన్నారు.