నంద్యాల (బిఎన్ న్యూస్), ఫిబ్రవరి 13: స్థానిక సంజీవ నగర్లో ఉన్న శ్రీ రామ కృష్ణ విద్యాలయం నందు మాజీ ఎంపీ యస్పివై రెడ్డి 15వ లోక్ సభ ఎంపీ నిధుల నుండి ఏర్పాటు చేయబడిన నూతన భవనాన్ని సోమవారం శ్రీ రామకృష్ణ విద్యాలయం కరెస్పాండంట్ నివర్తి మోహన్ కుమార్ గారు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముందుగా యస్పివై రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి స్మృత్యంజలి ఘటించారు. శ్రీ రామకృష్ణ విద్యాలయం కరెస్పాండంట్ నివర్తి మోహన్ కుమార్ మాట్లాడుతూ యస్పివై రెడ్డి సమాజ సేవ గురించి, విద్యాసంస్థలకు వారు చేసిన సహాయం గురించి ఎంతో కొనియాడారు. యస్పివై రెడ్డి గతంలో కూడా తమ విద్యాలయ భవన నిర్మాణానికి అవసరమైన నిధుల్ని సమకూర్చి సహాయం అందించారని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్బంగా యస్పివై రెడ్డి కుమార్తె సుజలకి వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యాలయం యొక్క సిబ్బంది, పూర్వపు విద్యార్థులు పాల్గొన్నారు.
