You are currently viewing నేడు నంద్యాలలో రాష్ట్రస్థాయి అనస్తీషియా వైద్య వైజ్ఞానిక సదస్సు

నేడు నంద్యాలలో రాష్ట్రస్థాయి అనస్తీషియా వైద్య వైజ్ఞానిక సదస్సు

  • Post category:Nandyal

భారత జాతీయ అనస్తీషియా వైద్యుల సంస్థ ఆధ్వర్యంలో,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అనస్థీషియా వైద్యుల సంఘం పర్యవేక్షణలో,నంద్యాల అనస్థీషియా వైద్యుల సంఘం నిర్వహణలో ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు నంద్యాలలో రాష్ట్రస్థాయి అనస్తీషియా వైద్యుల వైజ్ఞానిక సదస్సు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా నంద్యాల అనస్థీషియా వైద్యుల సంఘం స్థానిక మధుమణి సమావేశ భవనంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో నంద్యాల అనస్తీషియావైద్యుల సంఘం అధ్యక్షులు, సదస్సు నిర్వహణ కమిటీ చైర్మన్ డాక్టర్ జి. రవి కృష్ణ, సంఘం ఉపాధ్యక్షులు ,నిర్వాహక కమిటీ కార్యదర్శి డాక్టర్ మధుసూదన్ రెడ్డి, సంఘం కార్యదర్శి, నిర్వాహక కమిటీ కన్వీనర్ డాక్టర్ నాగరాజ రెడ్డి సదస్సు వివరాలు తెలియజేశారు. నంద్యాలలో రాష్ట్రస్థాయి అనస్తీషియా వైద్యుల వైజ్ఞానిక సదస్సు నిర్వహించడం ఇదే ప్రథమమని, రామకృష్ణ పీజీ కళాశాల ఆడిటోరియంలో ఈ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు.సదస్సులో అనస్తీషియా వైద్యరంగంలో వస్తున్న ఆధునిక మార్పులు, వాటిని వినియోగించే విధానం, పర్యవసానాల గురించి 10 అంశాలపై చెన్నై,బెంగళూరు,హైదరాబాద్, నెల్లూరు, రాజమండ్రి, గుంటూరు, అనంతపురం, తదితర ప్రాంతాలకు చెందిన అనస్తీషియా వైద్య రంగ ప్రముఖులు ప్రసంగిస్తారు. ఈ సదస్సులో రాష్ట్ర నలుమూలల నుండి అనస్తీషియా వైద్య నిపుణులు, అనస్తీషియా పీజీ వైద్య విద్య నేర్చుకుంటున్న విద్యార్థులు హాజరు అవుతున్నారు. సదస్సును నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానంద రెడ్డి, రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. సదస్సులో భారత జాతీయ అనస్తీషియా వైద్యుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ భీమేశ్వర్, మాజీ జాతీయ అధ్యక్షులు,ఐ అర్ సి చైర్మెన్ డాక్టర్ చక్ర రావు, జాతీయ కౌన్సిల్ సభ్యులు చింతల కిషన్, రాష్ట్ర సంఘం అధ్యక్షులు రెడ్డి ప్రసాద్, కార్యదర్శి డాక్టర్ అచ్యుతరామయ్య, కోశాధికారి డాక్టర్ శ్రీనివాసరావు,మాజీ జాతీయ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ కిరణ్ జేరా, రాష్ట్ర మాజీ అధ్యక్షులు వేణుగోపాలరావు సదస్సులో పాల్గొంటున్నారు. పాత్రికేయ సమావేశంలో డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ శస్త్రచికిత్సల వైద్యంలో అనస్థీషియా వైద్యుల పాత్ర చాలా కీలకంగా ఉంటుందని, అనస్తీషియా వైద్యరంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పుల వల్లనే అత్యంత ఆధునిక గుండె ఆపరేషన్లు, మెదడు ఆపరేషన్లు, అవయవాల మార్పిడి ఆపరేషన్ లు నిర్వహించే అవకాశం ఏర్పడిందన్నారు. మత్తుమందు వైద్యులు కేవలం ఆపరేషన్లకు మత్తుమందు ఇవ్వడమే కాకుండా అత్యవసర చికిత్సా విభాగం లో కీలకమైన పాత్ర నిర్వహిస్తున్నారని,ముఖ్యంగా గత రెండు సంవత్సరాల కరోనా సమయంలో అత్యవసర చికిత్సా విభాగం లో దేశవ్యాప్తంగా అనస్తీసియా వైద్యులు విశేషంగా కృషి చేసి వేలాది ప్రాణాలు కాపాడారని తెలిపారు. అనస్తీషియా వైద్యరంగంలో వస్తున్న మార్పులు ఎప్పటికప్పుడు మత్తుమందు వైద్యులు తెలుసుకోవడం ద్వారా సురక్షితంగా శస్త్ర చికిత్సలు జరిగే అవకాశం ఏర్పడుతుందన్నారు. అందుకోసమే ఈ వైద్య విజ్ఞాన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు.