నిత్యం కరువుతో అలమటిస్తూ, త్రాగడానికి గుక్కెడు నీరులేక గొంతెండి పోతున్న రాయలసీమ ప్రజల దుస్థిని చూసి అన్ని రంగాలలో వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభివృద్ధికి కృష్ణా నదిపై సిద్దేశ్వరం వద్ద కృష్ణా- పెన్నార్ ప్రాజెక్ట్ నిర్మాణానికై బ్రిటీష్ కాలం నుండే ప్రతిపాధనలు ఉన్నాయని రాయలసీమ సాగు నీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి అన్నారు. ఈ ప్రాజెక్టు కు సంబంధించిన సర్వేలు అప్పుడే జరిగాయని, రెండో ప్రపంచ యుద్ద తదితర కారాణాల వలన ఈ ప్రాజక్టు నిర్మాణం జరగలేదన్నారు. ఏది ఏమైన స్వతంత్ర భారత దేశంలో ఉమ్మడి మద్రాసు రాష్ర్టంలోనే రాయలసీమ కరువును పారద్రోలటానికై 1951 వ సంవత్సరం ఈ ప్రాజెక్టుకు ప్లానింగ్ కమీషన్ అనుమతించింది. కానీ, రాష్ట్ర విభజన అనంతరం తెలుగు రాష్ట్రం ఎర్పడిన తరువాత నాగార్జున సాగర్ నిర్మాణం చేస్తే ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని కృష్ఢా -పెన్నార్ ప్రాజెక్టుకు తిలోదకాలు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు.దీనితో రాయలసీమ తీవ్రంగా నష్టపోయిందని, తదనంతరం నిర్మించిన శ్రీశైలం రిజర్వాయర్ కూడా సిద్దేశ్వరంకు 86 కి.మీ. దిగువన నాగార్జున సాగర్ కు ఓవర్ హెడ్ ట్యాంక్ లాగా నిర్మించారని ఆరోపించారు. శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా రాయలసీమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్న నమ్మకంతో శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం కోసం వేలాదిమంది రైతులు తమ భూములను త్యాగం చేసారని, రైతుల త్యాగాలను గుర్తించి వారి ఉన్నతికోసం, అభివృద్ధి కోసం పాటుపడవలసిన ప్రభుత్వాలు అప్పటి నుండి ఇప్పటి వరకు వారిని ఆదుకున్నది లేదని, శ్రీశైలం ప్రాజెక్టు కోసం తమ సర్వస్వం కోల్పోయిన వేలాదిమంది రైతులు ప్రస్తుతం దీనావస్థలో జీవనం సాగిస్తున్నారని బొజ్జా ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనప్పటికి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి నికర జలాల ఆధారంగా ఎస్ ఆర్ బి సి, మద్రాసు త్రాగు నీటి పథకం, అంతర్గత సర్దుబాటుతో కె్సి కెనాల్, మిగులు జలాల ఆధారంగా తెలుగు గంగ, గాలేరు నగరి, హంద్రీనీవా ప్రాజక్టుల నిర్మాణం జరిగింది. మిగులు జలాల మీద నిర్మించిన పై ప్రాజక్టులను అనుమతించిన ప్రాజెక్టులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టం 2014 లో స్పష్టంగా పేర్కొన్నారని, విద్యుత్ ఉత్పాదన కంటె సాగునీటికి, సాగునీటి కంటె త్రాగు నీటికి ప్రాధాన్యత అని రాష్ట్ర విభజన చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారని ఆయన వివరించారు. అంతే కాకుండా శ్రీశైలం రిజర్వాయర్ లో కనీస నీటి మట్టం పై 60 టీ.ఎం.సీ. ల క్యారీ ఓవర్ రిజర్వుగా నిలువ ఉంచడానికి బచావత్ ట్రిబ్యునల్ చట్టం కూడా చేసింది. ఈ సంవత్సరం శ్రీశైలం రిజర్వాయర్ కు చేరవలసిన నీటి కంటే రెండంతలు అధనంగా కృష్ణా జలాలు వచ్చాయని, ఇలాంటి సంవత్సరంలో సంగమేశ్వరం గుడి పూర్తిగా నీటిలో మునిగి ఉండాలి. కాని శ్రీశైలం రిజర్వయర్ ను ఖాళీ చేసి రిజర్వాయర్ లో బురదను మిగిల్చి రాయలసీమ సమాజం పట్ల తమ వివక్షను పాలకులు ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న తంతేనని, ఈ విషయంపై పాలకుల స్పంధన అంతంత మాత్రంగానే ఉందని, ఇతర రాజకీయ పార్టీలకు కూడా ఇది ఒక అంశమే కాదని పేర్కొన్నారు. రాయలసీమ ఆంధ్రప్రదేశ్ లో ఒక భాగం అనే భావనే లేని నేపథ్యంలో సిద్దేశ్వర ఉద్యమం 2016 లో మొదలైందని వివరించారు. రాయలసీమ పట్ల పాలకుల నిర్లక్ష్యాన్ని సభ్యసమాజం ముందుంచి, రాయలసీమ చట్టబద్ద నీటి హక్కుల సాధన లక్ష్యంగా మే 31, 2016 న వేలాది మంది రైతులు, ప్రజలు స్వచ్చందంగా సిద్దేశ్వరం అలుగు ప్రజా శంకుస్థాపన చేసారని గుర్తు చేశారు. ఆ రోజు నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం రాయలసీమ రైతులు, ప్రజలు స్వచ్చందంగా సిద్దేశ్వర అలుగు వార్షికోత్సవం నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా రాయలసీమ మహజన సభ, సిద్దేశ్వర వాహన యాత్ర, వంద కి.మీ. సిద్దెశ్వర పాద యాత్ర, 400 పైగా కేంద్రాలలో సత్యాగ్రహం, కరోనా నేపద్యంలో కుటుంబ సభ్యులతో వందలాది గృహాలలో సత్యాగ్రహం నిర్వహించడమైనదన్నారు. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్న, సిద్దేశ్వరం అలుగు నిర్మించాల్సిన కృష్ణా నది ప్రాంతలో వంతెన నిర్మాణంతో కల్వకుర్తి నంద్యాల మద్యన నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మాణంను కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సందర్భంలో కూడా, అక్కడ వంతెనతో పాటు అలుగు కూడా నిర్మించాలని అడగలేని రాజకీయ వ్యవస్థ, పాలకులు, రాయలసీమ ప్రజా ప్రతినిధులు ఉండటం దురదృష్టకరం అని అన్నారు.ఈ నేపధ్యంలో రాయలసీమ సాగునీటి సాధన సమితి, రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ వేదిక సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేపట్టాలని మే నెల 31, 2022 జలదీక్షా కార్యక్రమం నిర్వహిస్తున్నదని, ఈ కార్యక్రమం విజయవంతం చేయడానికి సన్నాహక సమావేశాలను రాయలసీమ ప్రజా సంఘాలు నిర్వహిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిద్దేశ్వరం అలుగు నిర్మాణ సాధ్యాసాధ్యాల అంచనాకై ఒక తెలంగాణ మరియు ఒక కోస్తాకు చెందిన సాంకేతిక నిపుణులతో ఏర్పాటు చేసిన ఇంజనీర్ ఇన్ చీఫ్స్ కమిటి (ఐదుగురు సభ్యలతో) 2011 లో ఈ ప్రాజెక్టు అవసరమని తెలుపుతూ, డిటైల్డ్ ప్రాజెక్టు నివేదికకు (డి పి ఆర్) నిధులు కేటాయించమని ప్రభుత్వానికి సిఫార్సు కూడా చేసిన విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకొని పోతున్నామని వివరించారు. ఈ ప్రాజెక్టు డి పి ఆర్ చేపట్టడానికి క్రియాశీలకంగా పని చేయడంలో ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు, పాలకులు విఫలమయిన విషయాలను కూడా ప్రజలకు రాయలసీమ సాగు నీటి సాధన సమితి, రాయలసీమ ప్రజా సంఘాలు వివరిస్తున్నాయని పేర్కొన్నారు. రాయలసీమ ప్రజల ఆశల ఆకాంక్షలను గౌరవిస్తూ ఎన్నో దశబ్దాల క్రితమే నిర్మించాల్సిన సిద్దేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని, అందుకు తాను కూడా సహకరిస్తానని జనసేన పార్టీ అధినేత పవణ్ కళ్యాణ్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని, అదే సందర్భంలో నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోదన స్థానం పరిరక్షణను సమర్థిస్తూ కర్నూలు జిల్లా రైతుల పోరాటానికి మద్దతు పలికినందకు రాయలసీమ సాగునీటి సాధన సమితి ధన్యవాదాలు తెలియజేస్తుందన్నారు.
